Chandrababu : చంద్రబాబు ఉల్లంఘనలకు పాల్పడలేదు..

Chandrababu : చంద్రబాబు ఉల్లంఘనలకు పాల్పడలేదు..
తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.

మధ్యంతర బెయిలుపై జైలు నుంచి విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోర్టు షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తేల్చిచెప్పింది. చంద్రబాబు ఇంటి వద్ద కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు DSPలను అనుమతించాలన్న ఏపీ CID అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రజలు పలకరిస్తే స్పందించడం సహజమన్న న్యాయమూర్తి.. చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ ప్రజలను ఆదేశించబోమని స్పష్టం చేశారు.

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో మధ్యంతర బెయిలపై విడుదలైన చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలని CID వేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు మీడియా సమావేశాలు నిర్వహించకుండా, రాజకీయ ర్యాలీలలో పాల్గొనకుండా అడ్డుకోవాలని, ద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి హైకోర్టుకు నివేదికలు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబును పలకరించేందుకు అనేక మంది ప్రజలు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. తనను చూసేందుకు వచ్చేవారిని చంద్రబాబు నిరోధించలేరనే విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారని చెప్పడానికి సాక్ష్యాధారాలు లేవన్నారు.

అనారోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిలు ఇవ్వడాన్ని స్టోడియల్‌ బెయిల్‌’తో సమానంగా చూడలేమన్నారు. చంద్రబాబు ఇంటివద్ద కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించడమంటే గోప్యత హక్కును హరించడమేనన్న చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలో బలం ఉందన్నారు. చంద్రబాబుపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు అధికార పార్టీ ప్రోద్బలంతో సీఐడీ కేసు పెట్టిందని, రాబోయే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవాలని చూస్తోందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారని గుర్తుచేశారు. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు సంబంధమేంటి, ఆ కార్యకలాపాలపై షరతుల విధింపు దర్యాప్తునకు ఎలా ఉపయోగపడుతుందో సీఐడీ స్పష్టత ఇవ్వాలన్నారు.


సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బెయిలు మంజూరు సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని, కారాగారం వెలుపల మాట్లాడారని, ర్యాలీలో పాల్గొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఐతే.. పెన్‌డ్రైవ్‌ పరిశీలిస్తే చంద్రబాబు రాజకీయ ర్యాలీలో పాల్గొన్నట్లు, బహిరంగ సమావేశం పెట్టినట్లు కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. మధ్యంతర బెయిలు దరఖాస్తులో ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతివ్వాలని చంద్రబాబు కోరలేదు. ఒకవేళ కోరి ఉంటే ఆయా పరిస్థితుల్లో మధ్యంతర బెయిలు ఇవ్వాలా లేదా అనే ప్రశ్న న్యాయస్థానం ముందు తలెత్తేది’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రాజకీయ ర్యాలీలు, బహిరంగ సమావేశాల్లో పాల్గొనవద్దని చంద్రబాబును ఆదేశిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగని చంద్రబాబుపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు కాదని, ఆయన ప్రాథమిక హక్కులను హరించినట్లు భావించడానికి వీల్లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story