Chandrababu: ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. టీడీపీ ఆఫీసులపై దాడిపై కేంద్రానికి ఫిర్యాదు..

Chandrababu (tv5news.in)
Chandrababu: చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు భారీ మైలేజ్ రావడంతో.. ఇదే ఊపు కొనసాగించాలనుకుంటోంది టీడీపీ. దీనిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడిని జాతీయ స్థాయికి తీసుకెళ్లనున్నారు. సోమవారం ఢిల్లీ పయనమవుతున్న టీడీపీ అధినేత.. దాడి ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఈమేరకు వారి అపాయింట్మెంట్ల కోసం టీడీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. 18 మంది నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రామ్నాథ్ కోవింద్ను చంద్రబాబు కలిసి ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాటిపోయినందున రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ బృందం కోరబోతోంది. రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి లభించింది.
ప్రధాని మోదీ, అమిత్షా అపాయింట్ మెంట్లు ఖరారయితే సోమవారం లేదా మంగళవారం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో పర్యటిస్తున్న అమిత్షా.. సోమవారం లేట్ అవర్ లో ఢిల్లీకి రానుండటంతో మంగళవారమే హోంమంత్రిని కలిసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిన వెంటనే అమిత్ షాకు ఫోన్ లో ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీలుకల్గితే స్వయంగా కలిసి ఫిర్యాదు చేయాలన్నది ఆలోచన. వీలైతే మరింతమంది జాతీయ నేతలను కలవడానికి కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ టూర్పై, దేశ రాజధానిలో అనుసరించబోయే వ్యూహంపై ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమై చర్చించారు. ప్రధానంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే నేషనల్ మీడియా కూడా రాష్ట్రంలో పరిస్థితులపై ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలో ఢిల్లీ వెళ్తున్న బృందంలో.. ఎంపీలతో సహా మరో పది మంది నేతలు ఉంటారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com