నేటితో ముగుస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం టూర్
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేటితో ముగియనుంది. చంద్రబాబు కుప్పం పర్యటనతో కార్యకర్తలు, టీడీపీ అభిమానుల్లో జోష్ పెరిగింది. మూడ్రోజుల పర్యటనలో పంచాయతీ ఎన్నికల్లో.. బలవంతపు ఏకగ్రీవాలు, రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు అంశాలపై వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు బాబు. ఇక ఇవాళ కుప్పం మున్సిపాలిటీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లి.. అక్కడి నుంచి సాయంత్రం విజయవాడ ప్రయాణం అవుతారు.
ఇక మూడ్రోజుల పర్యటనలో.. చంద్రబాబు రోడ్ షోకు పార్టీ నేతలు, కార్యకర్తలు నీరాజనం పట్టారు. అడుగడుగునా బాబుకు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ చంద్రబాబు పర్యటన కొనసాగింది. నిన్న కుప్పం నియోజకవర్గ ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. తరుచూ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని బాబు చెప్పడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రాన్ని స్వాహా చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు చంద్రబాబు. బాబాయ్ వివేకాను చంపింది ఎవరో జగన్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఏపీలో రౌడీరాజ్యం, అరాచకపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేదని నిలదీశారు. జగన్కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ఉక్కు కూడా పోయిందని, సీఎంకు సెంటిమెంట్ అంటే ఏంటో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com