Chandrababu : వివేకా నిందితుల హత్యకు కుట్ర జరుగుతోంది : చంద్రబాబు
రాష్ట్రంలో సీబీసీఐడీ నీచాతి నీచమైన స్థాయికి దిగజారిపోయిందంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ విజయవాడలోని ఎమ్మెల్సీ అశోక్బాబు నివాసానికి వెళ్లారు చంద్రబాబు.. అశోక్బాబును పరామర్శించారు.. అశోక్బాబు, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.. అరెస్టు, తదనంతర పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు.. అరెస్టు జరిగిన తీరును చంద్రబాబుకు వివరించారు అశోక్బాబు.. కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశంపైనే తనను ఎక్కువగా ప్రశ్నించారని చంద్రబాబుకు చెప్పారు.
అశోక్బాబును పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. అర్థరాత్రి అరెస్టులపై ఓ రేంజ్లో ఫైరయ్యారు.. టెర్రరిస్టుల్లా అశోక్బాబు పట్ల సీఐడీ వ్యవహరించిందని మండిపడ్డారు.. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి ఈ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామన్నారు చంద్రబాబు.
మూడేళ్ల భోగానికే జగన్కు అంత ఉంటే పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ఎంత ఉండాలంటూ చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు బాధపడినట్లే రేపు అనేది ఒకటుంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేరన్నారు చంద్రబాబు. మూడేళ్లలో టీడీపీ నేతలపై పెట్టిన కేసుల వివరాలు చెప్పాలంటూ సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ను ప్రశ్నించారు చంద్రబాబు.. నాలుగువేలకుపైగా అక్రమ కేసులు పెట్టడంతోపాటు ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ నిప్పులు చెరిగారు.
వివేకానంద హత్యకేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు.. మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్గా వున్న వరుణ్ రెడ్డిని ఇప్పుడు కడప జైలర్గా నియమించారని.. దీనిపై సీబీఐకి లేఖ రాస్తామని అన్నారు.. కడప జైల్లో ఉన్న వివేకా నిందితుల హత్యకు జైలర్ వరుణ్రెడ్డి సాయంతో కుట్ర జరుగుతోందంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com