వైసీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదు : చంద్రబాబు
వైసీపీ చెబుతోన్న ఏకగ్రీవాలు ప్రజామోదంతో జరిగేవి కాదని... దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ విధ్వంసాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
2014లో 2.6శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే.. 2020లో 20శాతం పైగా ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. 2014లో ఒక్క జడ్పీటీసీనే ఏకగ్రీవమైతే ఇప్పుడు పదుల సంఖ్యలో ఎలా చేయగలిగారని నిలదీశారు. మొత్తం 2700 పైగా దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 20నెలల్లో ఏం చేసారని ఓటేయాలని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అనేక రంగాల్లో నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలిపామన్నారు. 25వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు వేస్తే 20నెలల్లో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్డు వేశారని చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com