మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జగన్ ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తీర్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు.. ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. జగన్కు ఓటేస్తే ప్రజలపైనే భారం పడుతుందన్నారు చంద్రబాబు. ఇసుక, సిమెంట్, గ్యాస్, డీజిల్, పెట్రోల్, వంట నూనెల ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడిందన్నారు.
గురువారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తానూ పాల్గొంటానని చంద్రబాబు పార్టీ శ్రేణులకు వివరించారు. కష్టకాలంలో పోరాడితేనే నాయకులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్యగా అభివర్ణించారు చంద్రబాబు. మద్ంయ సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి టీడీపీ వారిపై కేసులు పెట్టడానికైనా అధికార పార్టీ నేతలు వెనకాడరన్నారు. ఇలాంటి వాళ్ల పట్ల నాయకులు జాగ్రత్త పడాలని సూచించారు. ధైర్యంగా పోరాడాలన్నారు.. ఏదైనా ఘటన జరిగితే తాను కూడా వచ్చి పోరాడతానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.. ప్రతి ఇల్లూ తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com