Chandrababu: సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..

Chandrababu: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి విజయవాడ అసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన ప్రత్యక్ష సాక్ష్యమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, మహిళలకు రక్షణలో ప్రభుత్వ వైఫల్యాలపై సీఎంకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందన్నారు.
మహిళల పట్ల హింస, అత్యాచారాలు పెరగడానికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమన్నారు. కూతురు కనిపించడం లేదని స్వయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం అమానుషమన్నారు చంద్రబాబు. విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.
అత్యాచారం ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు చంద్రబాబు. జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరమని లేఖలో పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపు ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయమన్నారు చంద్రబాబు.
దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంతమందిని శిక్షించారని నిలదీశారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదన్నారు చంద్రబాబు. గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయని లేఖలో వెల్లడించారు.
ముఖ్యమంత్రిగా మీ చర్యలు, మీ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించాలని సూచించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు, జీవనోపాధి కల్పించాలని.. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com