AP: తెలుగుదేశం నేతల విస్తృత ప్రచారం

AP: తెలుగుదేశం నేతల విస్తృత ప్రచారం
ఇంటింటి ప్రచారంతో హోరెత్తుతున్న ఆంధ్రప్రదేశ్‌.... జగన్‌ పాలనా వైఫల్యాలను వివరిస్తూ ప్రచారం...

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగాయి. గ్రామాల్లోకి విస్తృతంగా వెళ్లిన కూటమి అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలిసి మద్దతు కోరారు. జగన్‌ విధ్వంస పాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక చేసే పథకాలు, అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్డీయే కూటమి అభ్యర్థి పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించగా... 23, 24 వార్డులకు చెందిన వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. కోడుమూరులో వైసీపీ, కమ్యూనిస్టు నేతలు తెలుగుదేశంలో చేరారు. ఎంపీ అభ్యర్థి నాగరాజు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో వైకాపా నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఊటుకూరులో చేపట్టిన బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులైన 70 కుటుంబాలు వైసీపీని వీడి పసుపు కండువా కప్పుకున్నాయి.


ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయమని అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. శింగనమల నియోజకవర్గం బొమ్మలాటపల్లిలో బండారు శ్రావణి శ్రీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి వంద కుటుంబాలు తెలుగుదేశంలోకి వచ్చాయి. కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లిలో తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు ఇంటింటి ప్రచారం చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఎస్సీ,ఎస్టీ మైనార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం, రాజుగుంటలో జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్‌ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాజంపేటలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు జనసేన నాయకుల మద్దతుంటుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం యాదగిరి వారిపల్లిలో ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాద్‌... వైకాపా ప్రభుత్వంతో ప్రజలు విసిగి పోయారని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశానికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు నియోజకవర్గ కూటమి అభ్యర్ధి గురజాల జగన్మోహన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా సుబ్బారెడ్డి స్టేడియంలో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వాకర్స్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story