ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు
Dhulipalla Narendra: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు పంపింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ ప్రాంగణంలో ఉన్న 'ధూళిపాళ్ల వీరయ్య చౌదరి' ట్రస్ట్కి సంబంధించి వివరాలన్నీ ఇవ్వాలని కోరింది. దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ ప్రాథమిక విచారణకు ఈ నోటీసులు ఇచ్చారు. తాము అడిగిన పత్రాలన్నీ 10 రోజుల్లో అంద చేయాలని మేనేజింగ్ ట్రస్టీ నరేంద్రకు సూచించారు.
దేవాదాయ శాఖ చట్టం నిబంధనల ప్రకారమే వివరాలు అడిగినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ట్రస్టుకి ఉన్న ఆస్తుల వివరాలు, భూమికి సంబంధించిన వివరాలు, ట్రస్టు కార్యకలాపాల లెక్కలు, ట్రస్ట్ డీడ్ కు సంబంధించిన పత్రాలు అన్నీ కోరారు. 2018-19 నుంచి ఇప్పటి వరకూ ట్రస్టు ఆదాయ వ్యయాల లెక్కలు కూడా చూపించాలన్నారు. ట్రస్టు నుంచి వివరాలు అందిన తర్వాత వాటిపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com