Ex-Minister Narayanaswamy : సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి డుమ్మా!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణస్వామి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణకు హాజరు కాలేదు. సిట్ విచారణకు ఈరోజు రాలేనని అధికారులకు సమాచారం ఇచ్చారు నారాయణస్వామి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మరో రోజు విచారణకు వస్తానని నారాయణస్వామి తెలిపారు. సిట్ అధికారులు నారాయణస్వామి విచారణకు హాజరుకానందుకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మళ్ళీ నోటీసులు జారీ చేయాలా, లేదా ఇతర మార్గాలను అనుసరించాలా అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని ఈరోజు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించారు. మాజీ మంత్రి నారాయణస్వామి ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినందున, ఈ కేసులో ఆయన పాత్రపై సిట్ దృష్టి సారించింది. సిట్ అధికారులు మాజీ మంత్రి నారాయణస్వామికి నోటీసులు జారీ చేసి, జూలై 21, 2025 (సోమవారం) ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మద్యం పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఆయనను ప్రశ్నించాలని సిట్ భావించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com