CBN: కర్నూలులో హైకోర్టు బెంచ్, అమరావతిలో లీగల్ కాలేజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు... కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు.
100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇనిస్టిట్యూట్ను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
మైనారిటీ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ ను పుర్తి చేయాలని అధికారులను సీఎం అదేశించారు. ఇమామ్లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మైనార్టీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా మైనార్టీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్ల కు సంబంధించి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంత మేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ప్రారంభంకాని పనులను రద్దు చేసి పునః సమీక్ష చేయనున్నామని సీఎం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సుహాసినికి చంద్రబాబు కీలక పదవి..?
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహారచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ తెలంగాణ అధ్యక్షురాలి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను రాజ్యసభకు పంపిస్తారని చర్చ జరుగుతోంది. సుహాసినికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత, తెలంగాణలో పార్టీ భవిష్యత్కు మేలు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com