AP: కూటమి సభలో జన సునామి

AP: కూటమి సభలో జన సునామి
పవన్‍ కల్యాణ్‍, చంద్రబాబు సభకు పోటెత్తిన ప్రజలు.... రెండు గంటలు సాగిన రెండు కిలోమీటర్ల ప్రదర్శన

తిరుపతిలో పవన్‍ కల్యాణ్‍, చంద్రబాబు నాయుడు లీలామహల్‍ కూడలి నుంచి నాలుగుకాళ్ళ మండపం వరకు చేపట్టిన రోడ్‍ షోకు జనం పోటెత్తారు. ముందుగా ప్రకటించిన మేరకు లీలామహల్‍ కూడలి నుంచి రోడ్‍ షో ప్రారంభమవ్వాల్సి ఉండగా అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో మంగళం సమీపంలోని ఆశా కన్వన్షన్‍ సెంటర్‍ నుంచి ర్యాలీ సాగింది. దాదాపు రెండు కిలో మీటర్ల పాటు సాగిన రోడ్‍ షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. రోడ్‍ షో సాగుతున్న ప్రాంతంలో విద్యుత్‍ సరఫరా నిలిపివేయడంతో ప్రదర్శన చీకట్లోనే సాగింది. భారీగా తరలివచ్చిన ప్రజలతో రోడ్‍ షో ఆలస్యంగా సాగింది. ముందుగా ప్రకటించిన మేరకు 8 గంటలకు నాలుగు కాళ్ళ మండపానికి చేరుకోవాల్సి ఉన్నా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా రోడ్‍ షో సాగింది. సభావేదిక చేరుకునే సమయానికి 9.30 గంటలు కావడంతో నేతలిద్దరు అరగంట సమయంలోనే తమ ప్రసంగాలను ముగించారు.


జగన్‌పై తీవ్ర విమర్శలు

రోడ్‍ షో అనంతరం నాలుగుకాళ్ళ మండపం వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్‍ కల్యాణ్‍ టీటీడీ చైర్మన్‍ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారికి ఎందుకు ఓటేయ్యాలని పవన్‍ కల్యాణ్‍ ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను సెలవ విడిదీ కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో దళారీ రాజ్యమేలుతోందని... టీటీడీ కాంట్రాక్ట్ పనుల్లో 12 శాతం కమీషన్‍ తీసుకుని ఆదాయవనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. తితిదే ఉద్యోగుల ఇంటి పట్టాల పై జగన్‍ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. కరుణాకర రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‍ రెడ్డి రౌడీయిజానికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వస్తే తితిదే నిధులను ప్రజా సంక్షేమానికి వినియోగిస్తామన్నారు.


తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన ఘనత మాదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో దొంగలు పడ్డారని వారిని ఎదుర్కునేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్‍, చిరంజీవి ఇక్కడి నుంచే పోటీ చేశారని పోత్తుల్లో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. కూటమి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతిలో గరుడ వారధి, చంద్రగిరి బైపాస్‍ రహదారిని నిర్మించామని గుర్తు చేశారు. IIT, IISER ఏర్పాటు ద్వారా తిరుపతిని ఎడ్యుకేషన్‍ హబ్‍ గా తీర్చిదిద్దామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story