AP : దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో హైఅలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లే అవకాశం వుందని వాతావరణకేంద్రం తెలిపింది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రేపు అంటే శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com