MAHANADU: కడప గడ్డ.. టీడీపీ అడ్డా

కార్యకర్తలంతా ఐక్యంగా ఉంటే వైసీపీ అడ్రస్ గల్లంతేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడపలో జరిగిన మహానాడు ముగింపు బహిరంగసభలో ప్రసంగించిన చంద్రబాబు... వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కడప గడ్డ.. టీడీపీ అడ్డా అని అన్నారు. జనసముద్రంతో కడప మునిగిపోయిందని సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు.. దేవుని కడపలో మహానాడు పెట్టి చూపించామన్నారు. "కడప గడపలో మహానాడు సూపర్ హిట్ అయ్యింది.. అహంకారంతో విర్రవీగేవారికి ఎన్నికల్లో ప్రజలు అద్భుత తీర్పు చెప్పారు.. ఉమ్మడి కడపలో పదికి 7 స్థానాల్లో గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకోవాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. **జై తెలుగుదేశం అని కార్యకర్తలతో చెప్పించారు ముఖ్యమంత్రి. రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాలన్నారు. జనసంద్రంగా కడప నిండిపోయిందన్నారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని తెలిపారు.
ఆర్థిక ఉగ్రవాదులతో నష్టం
ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ ముష్కరులను ప్రధాని మోడీ అంతం చేశారని చంద్రబాబు అన్నారు. దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం జరుగుతోంది.. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. ల్యాండ్, శాండ్, మైన్ అన్నీ దోచేసుకున్నారు.. ఎక్కడ చూసిన జే బ్రాండ్ తో నాసిరకం మద్యం వ్యాపారం చేశారు.. డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పదికి పది గెలుస్తాం
ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకే తెలుగుదేశం పార్టీ పుట్టిందని టీడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలన్నారు. మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని కడప ప్రజలు చాటారన్నారు. ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాల్లో 7 గెలిచి సత్తా చాటిన మనం 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పరిపాలన ఎలా చేయకూడదో వైఎస్సార్సీపీ పాలన ఓ కేస్ స్టడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, 52 సీట్లకు 45 సీట్లతో కూటమిని గెలిపించారన్నారు. వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే టీడీపీ కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలోనే ఏడు సీట్లతో గెలిపించారన్నారు. ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నామని.. కానీ ఓడిపోయిన పార్టీ ఇంకా అర్థం చేసుకోలేదని మండిపడ్డారు.
వైనాట్లు, గొడ్డలి పోట్లు మా సిద్ధాంతం కాదు
వైనాట్లు, గొడ్డలి పోట్లు మన రాజకీయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయటమే మన విధానమన్నారు. క్లైమోర్మైన్స్కే భయపడని తాను సమస్యలకు భయపడతానా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన కష్టం తన కోసం కాదని, తనను నమ్ముకున్న జనం కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com