Manchu Vishnu: జగన్తో మంచు విష్ణు సమావేశం.. సినిమా టికెట్ల అంశంపై..
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. జగన్తో సమావేశమవుతున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన మంచు విష్ణు కాసేపట్లో జగన్తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ సినిమా టికెట్ల అంశంపై చర్చించడానికా లేక పర్సనల్ మీటింగా అన్నది తేలాల్సి ఉంది. సినిమా టికెట్ల అంశం అయితే గనక సీఎంవో నుంచే పిలుపు వస్తోందని గతవారం చిరంజీవి చెప్పుకొచ్చారు.
మంచు విష్ణుకు కూడా అలాగే పిలుపు వచ్చిందా లేక వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఆయనే స్వయంగా వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. చిరంజీవి ఒక్కరే జగన్ను కలవడానికి వెళ్లినప్పుడు.. అది సినిమా పరిశ్రమ గురించి కాదు, కేవలం పర్సనల్ మీటింగ్ అంటూ కామెంట్ చేశారు మంచు విష్ణు. గత వారమే చిరంజీవి బృందం జగన్ను కలిసింది.
సినిమా టికెట్ల అంశంపై పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి వెళ్లినప్పటికీ.. మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ వెళ్లలేదు. సీఎంవో నుంచి పిలుపు వచ్చిన వాళ్లు మాత్రమే జగన్తో భేటీకి వస్తున్నారంటూ ఆనాడు చిరంజీవి చెప్పుకొచ్చారు.
కాని, 24 గంటలు తిరక్కుండానే హైదరాబాద్లోని మోహన్బాబు ఇంటికి వెళ్లి మరీ కలుసుకున్నారు మంత్రి పేర్ని నాని. జగన్తో చిరంజీవి బృందం మాట్లాడిన అంశాలపై మంత్రి పేర్ని నాని వివరించారంటూ ట్వీట్ చేసి మరీ డిలీట్ చేశారు మంచు విష్ణు. కాని, మంత్రి పేర్ని నాని మాత్రం సినిమా టికెట్ల అంశంపై వివరణ ఇవ్వడానికి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చారు.
సినిమా టికెట్ల అంశంపై ఈ నెలాఖరు కల్లా జీవోలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై నియమించిన కమిటీ కూడా తుది నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ను కలవడానికి మంచు విష్ణు వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మా అధ్యక్షుడిగా వెళ్లి ఉంటే.. ఒక్కరే వెళ్లడం కరెక్ట్ కాదంటూ అప్పుడే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com