తక్షణమే ఆ ఆలోచన మార్చుకోవాలి..సీఎం జగన్కు ఎంపీ రఘురామ మరో లేఖ..!

RaghuramaKrishnamRaju:ఎంపీ రఘురామకృష్ణ రాజు సీఎం జగన్కు మరో లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు తగ్గించే ఆలోచన..మానుకోవాలని సీఎం జగన్కి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. 57 ఏళ్లకే పదవీ విరమణ వయసును కుదించాలనుకోవడం దారుణమన్నారు. పదవీ విరమణ చేసిన జస్టిస్ కనకరాజ్, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు మళ్లీ బాధ్యతలు పరస్పర విరుద్ధమైన నిర్ణయమన్నారు. ఇక ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించలేకపోతున్నామన్న రఘురామ. మాజీ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నామని పేర్కొన్నారు.
పరస్పర విరుద్ధమైన చర్యలతో సీఎం జగన్ పక్షపాత వైఖరిని వెల్లడిస్తున్నారని మండిపడ్డారు. సీఎంను ఆశ్రయించిన వారికి సాధారణ ప్రజలకు వ్యత్యాసం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని రఘురామ అన్నారు. ఇక ఆదరాబాదరాగా తీసుకుంటున్న పరస్పర విరుద్ధనిర్ణయాలతో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆరాటపడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటే అంతలా పశ్చాత్తాపం చెందాల్సి వస్తుందని లేఖలో రఘురామ అన్నారు.
ఇంతటి దారుణమైన ఆర్ధిక పరిస్థితిలో ఉన్న రాష్ట్రం.. పదవీ విరమణ చేసే దాదాపు 16వేల మంది ఉద్యోగులకు.. విరమణ లాభాలను కూడా కలిపి ఎలా ఇవ్వగలుగుతామని ప్రశ్నించారు. బడ్జెట్లో ఎలాంటి వెసులుబాటు పెట్టుకోకుండా అర్ధంతరంగా తీసుకునే నిర్ణయంతో పడే ఆర్ధిక భారాన్ని ఎలా పూడ్చుకోగలుగుతామన్నారు. తక్షణమే ఆలోచన మార్చుకోవాలని రఘురామ సూచించారు. యువతకు మేలు కలిగించే విధంగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల కల్పనపై శ్రద్ధ పెట్టాలన్నారు.
ప్రభుత్వ దృష్టి విధ్వంసం పై నుంచి నిర్మాణాత్మక విధానాలపైకి సారించాలని రఘురామ అన్నారు. ఎంతో అనుభవంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగులను అక్కున చేర్చుకోవడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు నింపాలన్నారు. ఇప్పటి వరకూ వ్యాపించిన వదంతులు సీనియర్ ఉద్యోగుల మనస్సులో కొంత అభద్రతా భావం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల సీఎం లేదా సంబంధిత మంత్రులు లేదా అధికారులు తగిన వివరణ ఇవ్వాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com