Raghurama Krishnam Raju : అన్న క్యాంటీన్లు తెరవాలని కోరుతూ సీఎం జగన్కు ఎంపీ రఘురామ లేఖ
Raghurama Krishnam Raju : ఏపీ సీఎం జగన్కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రోజుకొక సమస్యపై లేఖలు సంధిస్తున్నారు. ఇవాళ లేఖలో అన్నా క్యాంటీన్లు తెరవాలని కోరారు. పేదవారి కడుపు నింపడానికి మించిన సంతృప్తి ఉండదని... అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారు కడుపు నింపుకునేవారని లేఖలో పేర్కొన్నారు. రోజుకు సుమారు 15 లక్షల మందికి ఆకలి తీర్చే ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించి, దాతల నుంచి విరాళాలు కూడా సేకరించేదని ఎంపీ రఘురామ గుర్తు చేశారు. అక్షయపాత్ర లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థకు భోజనం తయారీ కాంట్రాక్ట్ ఇచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అక్షయపాత్ర ఆర్డర్లు తగ్గిస్తూ... అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసివేశారని పేర్కొన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు, తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్నాయని... వైసీపీ మాత్రం పేదవారి ఆకలిని గాలికొదిలేసిందని లేఖలో విమర్శించారు.
కాంట్రాక్టర్లను మార్చేందుకే అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు మంత్రి బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారని రఘురామ లేఖలో ప్రస్తావించారు. వెయ్యి కోట్ల రూపాయలతో జననన్న క్యాంటీన్లు ప్రారంభించాలని రఘురామ డిమాండ్ చేశారు. జులై 8న క్యాంటీన్లను ప్రారంభించి వైఎస్సార్ జయంతి కార్యక్రమాలకు సార్థకత చేకూర్చాలని అన్నారు. జగనన్న క్యాంటీన్లు లేదా రాజన్న క్యాంటీన్లను ప్రారంభించాలని తెలిపారు.
అటు.. ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని రఘురామ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖలు రాశారు. గతేడాది జనవరి 27న మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందని చెప్పారన్నారు. మండలి నిర్వహణ అనవసర ఆర్ధిక భారం తప్ప ప్రయోజనం లేదన్న తమ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయన్ని ఆమోదించాలని కోరారు. జూలై 19న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో మండలి రద్దు తీర్మానం ఆమోదించాలని కోరారు. వైసీపీ ఎంపీగా ఈ లేఖను రాస్తున్నట్టు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com