Chandrababu : పసుపు మయంగా మారిన కుప్పం

చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి

40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ ఎదుర్కోనన్ని కేసులు గత ఐదేళ్ల పాలనలో ఎదుర్కొన్నారు. 2019 ముందు వరకు ఆయన మీద రెండు కేసులే ఉండగా ఈ ఐదేళ్లలో 22 కేసులు పెట్టారు. కుప్పంలో దాఖలు చేసిన నామినేషన్‌ అఫిడవిట్‌లో తనపై ఉన్న కేసులను చంద్రబాబు పొందుపరిచారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు చేశారు.

2019కి ముందు గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సమయంలో ధర్మాబాద్ పోలీసులు.. ఒక కేసు నమోదు చేయగా... 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు పెట్టారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక... 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 FIRలు కట్టినట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో 8, అన్నమయ్య, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు చొప్పున... అలాగే.. అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక కేసు ఉన్నట్లు వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో కురబలకోట మండలం అంగళ్లులో గతేడాది ఆగస్టులో తెదేపా కార్యకర్తలను వైకాపా శ్రేణులు రెచ్చగొట్టినప్పటికీ... తిరిగి ప్రతిపక్షంపైనే కేసులు పెట్టారు. చంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కట్టారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై తెదేపా శ్రేణులు రాళ్లు, నీళ్ల బాటిళ్లు, చెప్పులు విసిరి అద్దాలు పగలకొట్టి చంపబోయారంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఉచిత ఇసుక పాలసీలో తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని.., ప్రివిలేజ్ ఫీజు, డిస్టలరీలు, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లిందని, సీఆర్డీఏ, రాజధాని, ఇన్నర్ రింగు రోడ్డు మాస్టర్‌ నిర్ణయాల్లో అవతవకలకు పాల్పడి కొందరికి అనుచితంగా లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఫైబర్‌ నెట్‌, ఎసైన్డ్‌ భూములు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపైనా సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కొవిడ్ రెండో వేవ్, 440కే వేరియంటు గురించి ప్రచార, ప్రసార, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు నగరం అరండల్‍ పేట, పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ, కర్నూలు ఒకటో పట్టణ స్టేషన్లలో కేసులు పెట్టారు. కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు.... చంద్రబాబు విజయవాడ నగరం సూర్యారావుపేట ఠాణాలో ఒక కేసు నమోదు చేసినట్లు అఫిడవిట్‌లో వివరించారు.

తిరుపతి జిల్లా ఏర్పేడులో, విశాఖలోని విమానాశ్రయం పోలీస్‌ స్టేషన్‌లో, విజయవాడ పటమట ఠాణాలోని ముందస్తు అరెస్టులు, హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్నప్పుడు... కాన్వాయ్ ఆపి కారు దిగి కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు నందిగామ స్టేషన్‍ లో నమోదైన కేసుల్లో చంద్రబాబు పాత్ర రుజువు కాలేదని పోలీసులు కేసులు మూసేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా చంద్రబాబు వాటిని ప్రస్తావించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆసుపత్రికి వెళుతున్న ఓ చిన్నారి మృతి చెందారని... సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని కల్యాణదుర్గం ఠాణాలో కేసు పెట్టినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు

Tags

Read MoreRead Less
Next Story