LOKESH: హత్య రాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు

LOKESH: హత్య రాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు
వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్‌ హెచ్చరిక... టీడీపీ కార్యకర్త హత్యపై ఆవేదన

వైసీపీ అధినేత జగన్‌ ఇకనైనా హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్‌ హెచ్చరించారు. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో గిరినాథ్ చౌదరి అనే టీడీపీ కార్యకర్తను వైసీపీ నేతలు వేటకొడవళ్లతో నరకడంపై లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదన్న లోకేష్ వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతామని స్పష్టం చేశారు. బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని జగన్ చంపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు గిరినాథ్‌ హత్యపై ఏం సమాధానం చెప్తారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి నిలదీశారు.


నేడే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు వీలుగా కూటమి MLAలు చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. ఇందుకోసం విజయవాడ A-కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ ఉదయం తొమ్మిదిన్నరకు తెలుగుదేశం-జనసేన- బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.... చంద్రబాబు పేరును సీఎంగా ప్రతిపాదించనుండగా,.. బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుస్తారని తెలుస్తోంది. అనంతరం చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపనున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం కూటమిని గవర్నర్ ఆహ్వానించనున్నారు.

మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఆశావహులు చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఉండవల్లిలోని ఇంటికి క్యూ కడుతున్నారు. చంద్రబాబుతోపాటు ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారు? మంత్రివర్గంలో 25 మందికి మాత్రమే అవకాశం ఉండడంతో MLCలకూ కేబినెట్ లో చోటిస్తారా? లేదా?అనే సందిగ్ధం నెలకొంది. పవన్ కళ్యాణ్ కు... ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో జనసేన-బీజేపీల నుంచి ఎంతమందికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుతున్నాయి. రేపు జరిగే వేడుకకు కేసరపల్లి ఐటీ పార్క్‌ ముస్తాబవుతోంది. ప్రమాణ స్వీకారానికి 112 వైసీపీ బాధిత కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి కళకళలాడుతోంది. రేపు ఉదయం.. 11 గంటల 27 నిమిషాలకు ఐటీ పార్క్‌ వద్ద జరిగే ప్రమాణ స్వీకారానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రానుండడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Next Story