SC: ఫైబర్‌ నెట్‌ కేసు నవంబర్‌ 8కి వాయిదా

SC: ఫైబర్‌ నెట్‌ కేసు నవంబర్‌ 8కి వాయిదా
పీటీ వారెంట్ పై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబరు 8వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే స్కిల్ కేసులో ముందుగా తీర్పు ఇస్తామని జస్టిస్ అనిరుద్ధబోస్ , జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం వెల్లడించింది. స్కిల్ కేసు తీర్పు తర్వాత ఫైబర్ నెట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు తెలిపారు. అప్పటివరకు పీటీ వారెంట్ పై యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు...విచారణను వచ్చేనెల 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే..దీనిపై నవంబరు 8న కాకుండా అవకాశం ఉంటే 9వ తేదీన విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు. బెయిల్ పిటిషన్ పై విచారణే కనుక రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు.

సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని తెలిపారు. ఫైబర్‌నెట్‌ కేసులో అరెస్ట్‌ చేయవద్దని ఇప్పటికే చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతోందని.. ఈ అంశాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌లో తెలిపామని చెప్పారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేసింది. తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా నవంబర్‌ 9న విచారణ చేపట్టాలని సిద్ధార్థ లూథ్రా కోరగా.. రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫైబర్‌ నెట్‌ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని స్పష్టం చేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags

Read MoreRead Less
Next Story