అదృష్టం బాగుండి వైసీపీ అధికారంలోకి వచ్చింది : పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదృష్టం బాగుండి వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. 151 మంది ఎమ్మెల్యేలున్నా పరిపాలించడం చేతకాక అరాచకాలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని దుయ్యబట్టారు.
పోలీస్ వ్యవస్థకు చెబుతున్నా తమ సహనాన్ని పరీక్షిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జనసేనాని హెచ్చరించారు. వైసీపీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పట్టించుకోని పోలీసులు.. అమాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారన్నారు. ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలో ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని పవన్ పేర్కొన్నారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కల్యాణ్. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సపోర్ట్ చేయడం సర్వసాధారణమని, కాని పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ ఉద్యోగులు పునరాలోచన చేయాలని కోరారు. కరోనాను బూచిగా చూపించి ఎన్నికలు నిర్వహించలేమని చెప్పడం సరైంది కాదని విమర్శించారు.
అంతకుముందు తిరుమలలోని శ్రీవారిని పవన్ కల్యాణ్ సాంప్రదాయ దుస్తుల్లో దర్శించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com