కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి
డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

తెల్లవారుతుండగానే తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడాయి. విశాఖ బస్సు ప్రమాదం మరవకముందే మరో యాక్సిడెంట్ 14 మందిని పొట్టన పెట్టుకుంది. కర్నూలు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది మహిళలు సహా ఒక చిన్నారి ఉంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థతిలోనే 14 మంది మృతిచెందడంతో.. వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

మదనపల్లె నుంచి వస్తున్న టెంపో.. బెంగళూరు వైపు వెళ్తున్న లారీని డివైడర్ దాటుకుని వచ్చి ఢీకొట్టింది. వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో టెంపో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులు టెంపోలో చిక్కుకుపోవడంతో అతికష్టం మీద వారిని పోలీసులు బయలకు తీశారు. ప్రమాదం జరిగిన తర్వాత వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో.. ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాటిని క్రేన్ సాయంతో అధికారులు తొలగించారు. టెంపోలోని ప్రయాణికులు చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి అజ్మీర్ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని కర్నూలు కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ పకీరప్ప పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 14 మంది చనిపోవడం బాధాకరమన్నారు. ఏపీలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని.. వాటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story