PITHAPURAM: పిఠాపురంలో రూ. 80 లక్షల మద్యం స్వాధీనం

PITHAPURAM: పిఠాపురంలో రూ. 80 లక్షల మద్యం స్వాధీనం
పవన్‌ ఓటమే లక్ష్యంగా మద్యం ఏరులు పారిస్తున్న అధికార పార్టీ

సార్వత్రిక ఎన్నికల వేళ పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. అధికార పార్టీ నేతలు భారీగా మద్యం నిల్వ చేసినట్టు ఫిర్యాదులు అందడంతో ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో అక్రమ మద్యం నిల్వలు గుర్తించారు. పట్టణంలోని జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్‌ఆర్‌ గార్డెన్‌, కుమారపురం కాలనీల్లోని ఇళ్లలో నిల్వ చేసిన రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇంట్లోనే 2,560 లీటర్లకు పైగా మద్యం పట్టుబడింది. వేల కొద్దీ రాయల్‌ బ్లూ బ్రాండ్‌, గోవా కిక్‌ మద్యం సీసాలు బస్తాల్లో నిల్వ చేసినట్టు పోలీసులు తెలిపారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్డీయే కూటమి, వైకాపా మధ్య గట్టిపోటీ నెలకొంది. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

గెలుపు మాదే: పవన్‌

జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే యువకుడిపై కేసు పెట్టారని, దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై మాత్రం చర్యలు లేవని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న పవన్‌... జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తోందని, వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని... ఫొటోల కోసం పోటీ పడొద్దని.... క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అడ్డుపడొద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ఐదేళ్ల తన సంపాదనలో రూ.70కోట్ల ట్యాక్స్‌ కట్టానని... డబ్బు సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్‌ స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తీర్చడానికి మీలో ఒకడిగా వచ్చానని... రైతులకు సాగునీరందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారని.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని... కానీ, కోనసీమ రైతుల కన్నీళ్లు తుడవడానికి మనసురాలేదన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జగన్‌పై గులకరాయి పడితే అంతమంది జనసమూహం ఉన్నా నిందితుడిని పట్టుకోగలిగారని... కానీ, అంతర్వేది నరసింహస్వామి రథాన్ని కాల్చేసిన దుండగులను మాత్ర ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారని పవన్‌ మండిపడ్డారు. ఇలాంటి దుష్టపరిపాలన ఆగాలని... తన కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలకు దించారని.... అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా. జగన్‌.. గుర్తు పెట్టుకో ఇది 2019 కాదు.. 2024’’ అని పవన్‌ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story