Narasannapeta : నేడు స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలను పాఠశాలల్లో ప్రదర్శించారు. ఎన్నిక విధానం చేతులు ఎత్తడం లేదా చెప్పడం ద్వారా ఉంటుంది. ఎన్నికైన మొత్తం 15 మంది సభ్యుల్లో ఒకరిని ఛైర్మన్గా, మరొకరిని వైస్ ఛైర్మన్గా ఎన్నుకుంటారు. ఇవాళే ప్రమాణస్వీకారం చేసి తొలి కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులనూ నియమిస్తారు.
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలను కూడా కొన్ని గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగే ‘నాడు-నేడు’ పనులు నిర్వహించిన నాయకులు.. తమ బండారం బయట పడుతుందనే ఉద్దేశంతో ఈసారి కూడా ఎస్ఎంసీ తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరికొందరు మధ్యాహ్న భోజనం నిర్వాహకులను, ఆయాలను తొలగించకుండా.. తమ అనుయాయులను కొనసాగించాలంటే.. ఎస్ఎంసీలో తాము కీలకంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఎంసీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో సమస్యాత్మక గ్రామాల జాబితాను ఎంఈవోలు సేకరించి.. పోలీసులకు అందజేశారు. ఆయా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని నరసన్నపేట ఎస్ఐ అశోక్బాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com