Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లాలో ఆదివారం (జూలై 13, 2025) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న ఒక లారీ బోల్తా పడటంతో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మరణించారు. ఈ ఘటన పుల్లంపేట మండలం, రెడ్డిపల్లె చెరువు కట్టపై చోటు చేసుకుంది. రాజంపేట నుండి రైల్వేకోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కొందరు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తా పడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా మామిడికాయలు కోసే కూలీలున్నారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న వారిని బయటకు తీసి, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com