CBN: చంద్రబాబు ప్రచార షెడ్యూల్‌ ఖరారు

CBN: చంద్రబాబు ప్రచార షెడ్యూల్‌ ఖరారు
ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారం... 'ప్రజాగళం' పేరుతో...సభలు, రోడ్ షో లు

ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించి జోరుమీదున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుధవారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 'ప్రజాగళం' పేరుతో...సభలు, రోడ్ షో లు చేయనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రచించారు. ఈనెల 27న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు..., 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులో తెలుగుదేశం అధినేత పర్యటన సాగనుంది. సోమవారం, మంగళవారం సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో NDA అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జగన్‌ ప్రభుత్వ అరాచకాలను ఎండగతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేయబోయే కార్యక్రమాలు, పథకాలపై ప్రచారం చేస్తున్నారు. వారికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం, జనసేనలోకి చేరికలు పెరిగాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి అనే మాట లేకుండా చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సీఎం నివాసం వద్ద తాగునీటి సమస్య ఉన్నా చర్యలు లేవని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వజ్ర రెసిడెన్సీ అపార్ట్ మెంట్ వాసులతో లోకేష్ సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను అపార్ట్ మెంట్ వాసులు లోకేష్ కు వివరించారు.


ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి. గుండాలపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ జగదీశ్వరితో పాటు వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. వారికి తెదేపా అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు కండవా వేసి.... పార్టీలోకి ఆహ్వానించారు. మెంటాడ మండలం ఇప్పలవలసలోనూ వైకాపా నుంచి జనసేనలోకి 300 కుటుంబాలు చేరాయి. జనసేన నేత శివశంకర్‌ ఆధ్వర్యంలో వారంతా పార్టీలో చేరారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీట్‌-గ్రీట్‌ కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పాల్గొన్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని పెమ్మసాని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story