CBN: విజయం మనదే

CBN: విజయం మనదే
X
కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందన్న చంద్రబాబు... కౌంటింగ్‌ వేళ అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు హితవు

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని....... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన..... కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశ్యంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు భాజపా నేతలు పురందేశ్వరి, అరుణ్ సింగ్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.


ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయన్న చంద్రబాబు ఓటమి భయంతో కౌంటింగ్ పై వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. ఇప్పటికే అధికార పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని వైకాపా చూసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. కౌంటింగ్ రోజునా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందన్న ఆయన..కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని....అధికారులు నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలని చెప్పారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ అశ్రద్ధ వహించొద్దని...కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని సూచించారు.

ఏపీలోనూ 53 శాతం ఓట్లతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తేల్చిచెప్పారు. ఏపీలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందన్నారు. ఓట్ల లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడిగాలని నేతలకు సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ లెక్కింపు సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.

Tags

Next Story