Murder Attempt on TDP Leader : టీడీపీ కార్యకర్తపై దాడి.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నం?
Murder Attempt on TDP Leader : గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తల వికృత క్రీడ మరోటి బయటపడింది. కొప్పర్రుకు చెందిన టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నానికి తెగబడ్డారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు. పెద్దకూరపాడులో అత్తింటికి వచ్చి వెళ్తున్న వెంకట నారాయణపై దాడికి తెగబడ్డారు. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. బోయపాలెం సమీపంలోని ఓ వైన్ షాపు వద్ద ఈ ఘటన జరిగింది.
స్థానికుల సమాచారంతో బాధితుడిని గుంటూరులోని జీజీహెచ్కి తరలించారు బంధువులు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. చంద్రబాబును అనరాని మాటలు అంటుంటే విని తట్టుకోలేక వారిని వారించానని.. అందుకే తనపై దాడిచేశారని బాధితుడు వెంకట నారాయణ చెప్తున్నాడు. ప్రస్తుతం అతను తలకు తీవ్ర గాయమై జీజీహెచ్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
మద్యం సీసాలతో తలపై బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానని బాధితుడు చెప్తున్నాడు. అయితే, తనపై దాడిచేసింది కొందరు ముస్లిం యువకులని.. వాళ్లలో ఒకరు బాచీ బాచీ అని పిలుస్తున్నాడని అంటున్నాడు. ఈ దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో చంద్రబాబును దూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే దళితుడైన వెంకటనారాయణ చేసిన నేరమా అని ప్రశ్నించారు.
మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి.. రాక్షస మూకల మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పును తప్పని చెబితే చంపేస్తారా.. మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీస్తారా అని ప్రశ్నించారు. ఒంగోలులో ఆర్యవైశ్యుడైన సొంత పార్టీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంకటనారాయణ.. ఇలా రోజుకొకరు వైసీపీ పిశాచ ముఠాలకు బలవ్వాల్సిందేనా అన్నారు. ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోందనేది సుస్పష్టమన్న లోకేష్.. అడ్డుకోవాల్సిన పోలీసులేమయ్యారని ప్రశ్నించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com