Andhra Pradesh: పల్లెల్లో పసుపు హవా

Andhra Pradesh: పల్లెల్లో పసుపు హవా
X
టీడీపీ వైపు చూస్తున్న పల్లె ఓటరు

పల్లె సీమల్లో టీడీపీ పుంజుకొంది. గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసీపీకి సై అంటే సై అంటూ సవాల్‌ విసిరింది. అధికార పక్షం వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని రకాలుగా అధికారాన్ని ప్రయోగించింది.భారీగా డబ్బు ఖర్చు చేసింది. అయినా టీడీపీ ప్రజలనే నమ్ముకుని పంచాయతీలు, గ్రామ వార్డుల్లో మంచి ఫలితాలు సాధించింది. అయితే, ఈ విజయాలు అంత తేలిగ్గా రాలేదని, డబ్బు... అధికార దుర్వినియోగంపై బలంగా పోరాడాల్సి వచ్చిందని టీడీపీ వర్గాలు తెలిపారు.

ఏపీలో ఏ ఎన్నిక జరిగినా ఫలితం వైసీపీ దేనని వైనాట్‌ 175 అంటూ సీఎం జగన్‌ ఢంకా భజాయించి చెబుతుంటారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెలు పసుపుమయం అయ్యాయి. సీఎం సొంత జిల్లాలో ఐదు వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదార్లు ఏకంగా మూడింటిని.. వైసీపీ.. వైసీపీ రెబల్‌ అభ్యర్థులు చెరొక స్థానాన్ని గెలుచుకోవడం రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్యపోయాయేలా చేశాయి. మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ ఫ్యాన్‌ గాలి తగ్గడం స్పష్టంగా కనిపించింది. సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికలివి. దీంతో ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ పట్టు చూపించడానికి అధికార పార్టీ వైసీపీ విశ్వప్రయత్నం చేసింది.

కోనసీమ జిల్లాలోని ర్యాలీ గ్రామంలో ఒక వార్డు ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు అధికార పార్టీ నేతలు చీరలు పంచుతుంటే టీడీపీ, జనసేన మద్దతుదారులు అడ్డుకొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు స్వయంగా ఎన్నికలను పర్యవేక్షించారు. ఇటీవల రాజకీయంగా వేడెక్కిన ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం నియోజకవర్గం నున్న గ్రామ పంచాయితీ పరిధిలో ఒక వార్డు ఎన్నికను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడాయి. అధికార పార్టీ నేతలు భారీగా ఖర్చు పెట్టారు. అయినా అక్కడ టీడీపీ మద్దతుదారు గెలిచారు. అధికార పార్టీ బెదిరింపులు, ప్రలోభాలను పట్టించుకోకుండా ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం రాష్ట్రంలో మారుతున్న ప్రజాభిప్రాయానికి నిదర్శనమని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు.. జగన్‌ గ్రాఫ్‌ పడిపోయిందన్న సంకేతాలను ఈ ఎన్నికలు బలీయంగా ప్రజల్లోకి తీసుకెళతాయన్న అభద్రతా భావం అధికార పార్టీలో కనిపిస్తోంది.పట్టణ,విద్యావంతుల ఓటర్ల నాడి ఏంటో ఇటీవల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల్లో తేలిపోయింది. అయితే వాళ్లు మా ఓటర్లు కాదు. మా ఓటు బ్యాంకు వేరే ఉంది అంటూ వైసీపీ సాకులు చెప్పింది. ఇక నిన్న జరిగిన స్ధానిక సంస్థల ఉప ఎన్నికల్లో పల్లెల్లోనూ ఫ్యానుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేలింది.పంచాయతీ సర్పంచులు, గ్రామ వార్డు ఉప ఎన్నికల్లో టీడీపీ ఢీ అంటే ఢీ అనేలా వైసీపీతో పోటీపడింది.గతంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ 95 శాతంపైగా స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు సీన్‌ మారుతోంది. వైసీపీ ఖాతాలోంచి పల్లెలు కూడా జారుతున్నాయి.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు అన్ని అడ్డదారులూ తొక్కారన్న విమర్శలు వచ్చాయి.పలుచోట్ల బెదిరింపులకు దిగారు. ఘర్షణలకు పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభాలకు గురిచేసారని టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు

చేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందుల గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీకి చెందిన హిందూపురం వైస్‌ ఎంపీపీ రఘునాథరెడ్డి పోలింగ్‌ కేంద్రం వద్దే ఓటర్లకు వేయి రూపాయల చొప్పున నగదు పంపిణీ చేశారు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో రాచపల్లి నుంచి ఇద్దరు వలంటీర్లు చలివెందులకు ఓటర్లను తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వైసీపీ వర్గీయులు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు నోట్లు పంచారు. వలంటీర్లను రంగంలోకి దించి పథకాలు తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

వలంటీర్ల సహకారంతో మళ్లీ అధికారంలోకి వస్తామని భావిస్తున్న సీఎం జగన్‌ అంచనాలను ఈ ఫలితాలు నిరాశ పరిచాయని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి నిజానికి, ఎన్నికలు దూరంగా ఉండాలని ఈసీ ఆదేసించినా.. వలంటీర్లు వైసీపీకి ఓట్లేయాలని బహిరంగంగానే ప్రచారం చేశారు. అయితే, గతానికి ఈసారి ఓటర్లు మాత్రం ప్రలోభాలకు లోంగకుండా స్పందించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags

Next Story