AP : ఏపీలో 18 ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్న కేంద్రం

ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 'ఎన్ హెచ్-216ఎపై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు 2025 ఏప్రిల్ 2 నాటికి పూర్తి కానున్నాయని గడ్కరీ చెప్పారు. ఎన్ హెచ్-16 పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలు 2025 సెప్టెంబర్ 11కి, విశాఖపట్నం ఎయిర్పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ 2025 ఫిబ్రవరి 15కి, గుంటూరు మిర్చియార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6వ తేదీకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎన్ హెచ్-16 పై నాగులుప్పలపాడు గ్రోత్ సెంటర్, రాజుపాలెం జంక్షన్ల వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణాలకు అనుమతి లేఖలు ఇచ్చామనీ.. ఇదే హైవేలో రాజుపాలెం క్రాస్ రోడ్డు, జొన్న తాళి క్రాస్ రోడ్డు, చెవ్వూరు క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్తో పాటు ఎన్ హెచ్-44 పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలిచాం అని చెప్పారు. ఎన్ హెచ్-16లో శ్రీసిటీ జీరో పాయింట్, చిల్లకూరు సెంటర్ల వద్ద తలపెట్టిన ఫైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలవాల్సి ఉంది అని గడ్కరీ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com