TTD: లడ్డూ ప్రసాదంపై విచారణకు ఆదేశించిన టీటీడీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయన్న నివేదికలు దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం విచారణకు ఆదేశించింది. తిరుమల లడ్డూ ప్రసాదం సహా ఇతర ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో అడల్ట్రేషన్ జరినట్లు తేలితే.. నెయ్యి సరఫరాదాలుగా ఉన్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలారావు స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యుల కమిటీని వేసింది. ఈ కమిటీలో డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ మాధవన్ సభ్యులుగా ఉంటారని ఈవో చెప్పారు. వారంలో ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుంది. విచారణ జరిపి నివేదిక ఇవ్వడమే కాకుండా మున్ముందు ఇలాంటి ఘోరాలు జరగకుండా చూసేందుకు.. టెండర్ల ద్వారా నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వనుందని శ్యామలారావు వివరించారు.
బ్లాక్ లిస్ట్లో కాంట్రాక్టర్
టీటీడీకి పంపే నెయ్యి నాణ్యంగా ఉండాలని సప్లయర్స్కు పదేపదే చెబుతుంటామని.. అయితే ఒక కాంట్రాక్టర్ పంపిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు NABL రిపోర్ట్స్ స్పష్టం చేశాయని.. అందుకే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో ఉంచామని చెప్పారు. మరో సంస్థ కూడా నాశిరకం నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు తాము గుర్తించామని శ్యామలా రావు తెలిపారు. టీటీడీకి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు టెండర్ నాటి కండిషన్స్ వయోలేట్ చేసినట్లు తేలితే వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్ఫష్టం చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి అవసరమైన టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో లేదని.. ఇదీ వ్యవస్థలోని లోపమేనని ఈవో ఒప్పుకున్నారు. ఆ తరహా వ్యవస్థను సమకూర్చుకోవాల్సి ఉందన్నారు.
సహించం.. చర్యలు ఉంటాయ్
తిరుమల లడ్డూ ప్రసాదం పై సీఎం చంద్రబాబు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గత ప్రభుత్వం అన్నీ అపవిత్రం చేసిందని మండిపడ్డారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెంకటేశ్వరస్వామిని తీసుకెళ్లి అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం కరెక్టు కాదన్నారు. ‘తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువులకు కలియుగ దేవుడు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. ప్రసాదంలో అపవిత్రమైన ముడిసరుకులు వాడారు. ఈ దుర్మార్గులను ఏం చేయాలో తెలియడం లేదు. ఆధారాలు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని వాడుకోవద్దు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు.” అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com