మైదుకూరు పీఠంపై వైసీపీ, టీడీపీ కన్ను..!
రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తాడిపత్రి,మైదుకూరులల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కనబరిచింది. మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి.

రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తాడిపత్రి,మైదుకూరులల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కనబరిచింది. మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం 26 ఓట్లు. ఈ లెక్కన 14 ఓట్లు ఏ పార్టీకి వస్తే వారికే చైర్పర్సన్ పదవి దక్కుతుంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 24వార్డులకుగాను 12 చోట్ల టీడీపీ గెలుచుకుంది.
11 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఒక చోట జనసేన గెలుపొందింది. వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎంపీ అవినాష్రెడ్డి మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకోవడంతో ఇక్కడ వైసీపీ బలం 13కు పెరిగింది.
అయితే టీడీపీ మైదుకూరులో 12 వార్డులు గెలుచుకుంది. 19వ వార్డులో గెలిచిన జనసేన అభ్యర్థి టీడీపీ మద్దతు ఇస్తే వీరి బలం 13కు చేరుతుంది. అయితే ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, బీటెక్ రవి, శివనాథ్రెడ్డిలకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటుహక్కు ఉండటంతో ఎక్స్ అఫిషియో సభ్యులుగా వీరికి అవకాశం కల్పించలేదు.
జనసేన కౌన్సిలర్ టీడీపీకి మద్దతు తెలిపితే..వీరి సంఖ్య 13కు చేరుతుంది. దీంతో వైఎస్సార్సీకి, టీడీపీకి సరిసమానంగా 13 ఓట్లు వస్తాయి...దీంతో డ్రా అయే అవకాశం ఉంది. అప్పుడు లాటరీ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. అయితే మైదుకూరులో చైర్ పర్సన్ పదవిని దక్కించుకోవడానికి ఇరు పార్టీల నేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తూ సభ్యులు జారిపోకుండా జాగ్రత్త పడటంతోపాటు చివరివరకు ఇదే సంఖ్యను కొనసాగిస్తూ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.