YCP: కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలోనూ వైసీపీ అరాచకం

ప్రశాంతంగా ఎన్నికలు జరిగే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వైసీపీ శ్రేణులు ఈసారి అరాచకం సృష్టించారు. రాళ్లదాడులు, కార్ల అద్దాలు పగులగొట్టి రెచ్చిపోయారు. అటు మంత్రులు సైతం పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి హల్చల్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలింగ్ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. మంత్రి జోగిరమేశ్, తన అనుచరులతో కలిసి పోరంకి జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంపై దండయాత్ర చేశారు. తెలుగుదేశానికి బలమైన ఓటుబ్యాంకు ఉన్న ఈ కేంద్రంలో భయాందోళనలు సృష్టించి పోలింగ్ జరగకుండా చేసేందుకు యత్నించారు. తెలుగుదేశం నాయకులపై రాళ్లు రువ్వి, కట్టెలతో బీభత్సం సృష్టించారు. దాదాపు రెండు గంటల పాటు పోలింగ్కు అంతరాయం కలిగించారు.
దొంగఓట్లు వేసేందుకు యత్నిస్తున్నవారిని అడ్డుకున్న తెలుగుదేశం బూత్ ఏజెంట్లపైనే దాడి చేశారు. మంత్రి జోగిరమేశ్ స్వయంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి హల్చల్ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి బోడెప్రసాద్ అక్కడి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పెనుగంచిప్రోలు మండలం శివాపురంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. మచిలీపట్నంలోని సర్కార్తోట పోలింగ్ బూత్ వద్ద తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ నేతలకు దాడికి పాల్పడ్డారు. క్షతగాత్రులను... కొల్లురవీంద్ర, బాలశౌరి పరామర్శించారు. బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ సరళిపరిశీలనకు వెళ్లివచ్చే క్రమంలో ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కారు అద్దాలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. చీరాలలో టీడీపీ అభ్యర్థి కొండయ్య కుమారుడు మహేంద్రనాథ్ వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. అక్కడి చేరుకున్న కొండయ్య వాహనంపైనా రాళ్లు రువ్వారు. గన్నవరం నియోజకవర్గం తేలప్రోలులో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కారుపై వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దర్శి నియోజకవర్గం ఎర్రఓబునపల్లె, చౌటపాలెం, బట్లపాలెం పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాము ఓట్లకు డబ్బులు పంచాం కాబట్టి ప్రజలు ఓట్లు తామే వేస్తామంటూ వైసీపీ ఏజెంట్లు గొడవకు దిగారు. ఎవరి ఓటు వారే వేయాలని కోరిన టీడీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు. బట్లపాలెం వద్ద ఇరువర్గాల గొడవను చిత్రీకరిస్తున్న ఈటీవీ విలేకరి వీరనారాయణపై వైసీపీ మూకలు దాడిచేశారు. కిందపడినా వదలకుండా కొట్టి గాయపరిచారు. ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టారు. వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, సోదరుడు గొట్టిపాటి భరత్ నిరసనకు దిగారు. బొట్లపాలెంలో ఏజెంట్లు కుర్చీలతో కొట్టుకున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని నందిపాలెం పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పరామర్శించి తిరిగి వస్తున్న టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి కుమారుడు విఘ్నేశ్రెడ్డి వాహనంపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడి చేశారు. నెల్లూరు జిల్లాలో లింగసముద్రం మండలం మొగిలిచర్లలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com