AP: తెలుగుదేశంలో జోరుగా చేరికలు

AP: తెలుగుదేశంలో జోరుగా చేరికలు
వైసీపీకి షాకుల మీద షాకులు... జగన్‌ పాలన పోయి బాబు పాలన రావాలని ఆకాంక్ష

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశంలోకి చేరికలు జోరందుకున్నాయి. ఐదేళ్ల జగన్‌ పాలన చూసి విసుగెత్తిపోయిన వైసీపీ శ్రేణులు తెలుగుదేశం వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కావాలంటే జగన్‌ పాలన పోయి చంద్రబాబు పాలన రావాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం కండువా కప్పుకుంటున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి భారీగా చేరికలు జరిగాయి. పిడుగురాళ్ల మండలానికి చెందిన 250 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు వారికి పార్టీ కండువా కప్పారు. తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న యరపతినేని.... వైసీపీ పాలనలో విసుగు చెందిన అనేక మంది తెలుగుదేశంలో చేరుతున్నారన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలానికి చెందిన 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ భారీ షాక్ తగిలింది. నాగాయలంక మండలానికి చెందిన అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన 200 కుటుంబాలు కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. ఐదు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.


కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన శెట్టిబలిజ, మత్స్యకార కుటుంబాలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలో చేరాయి. తాళ్లరేవు మండలం పటవల, జార్జిపేటకు చెందిన 100 కుటుంబాలు మత్స్యకార గ్రామాలైన భైరవపాలెం, పెదవలసల నుంచి 400 కుటుంబాలు ముమ్మిడివరం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరాయి. శ్రీకాకుళంలో వైకాపా నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారని శ్రీకాకుళం అభ్యర్థి గోండు శంకర్‌ అన్నారు.


భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయ నిర్మల వెంకట్రావుతో పాటు విశాఖ జిల్లా చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు దుక్క కృష్ణాయాదవ్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం, మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు గడిదేశ సూర్యబాబు తెలుగుదేశంలో చేరారు. జీడి నెల్లూరులో సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు టీడీపీ గూటికి చేరారు. వీరికి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags

Read MoreRead Less
Next Story