Ap Government : ఏపీలో పంచాయతీరాజ్‌ నిధులను వాడుకున్న జగన్ ప్రభుత్వం

YS Jagan (tv5news.in)

YS Jagan (tv5news.in)

Ap Government : ఆస్తిపన్ను, ఇతరత్రా రుసుముల కింద వచ్చే సాధారణ నిధులనూ ఇప్పుడు మళ్లించడంతో సర్పంచులు మరింత రగిలిపోతున్నారు.

Ap Government : ఏపీలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లోని నిధులు ఖాళీ అయ్యాయి. సర్పంచ్‌లకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా, ఎటువంటి తీర్మానాలు చేయకుండానే..పీడీ అకౌంట్లలో ఉన్న పంచాయతీ నిధులను జగన్ ప్రభుత్వం తీసేసుకుంది. అత్యధిక పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిల కింద విద్యుత్ సంస్థలకు ఇప్పటికే పంపిణీ చేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ఆస్తిపన్ను, ఇతరత్రా రుసుముల కింద వచ్చే సాధారణ నిధులనూ ఇప్పుడు మళ్లించడంతో సర్పంచులు మరింత రగిలిపోతున్నారు. ప్రస్తుతం చాలా పంచాయతీల్లో ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. బోర్లు మరమ్మతులు చేయించాలన్న, పాడైన పైపులైన్లు సరి చేయాలన్న సాధారణ నిధులే పంచాయతీలకు ప్రస్తుతం ఆధారమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు మళ్లిస్తే సమస్యలెలా పరిష్కరిస్తామని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై. వి. బి.రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హై లెవెల్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ ఒకటవ తేదీన 12 వేల 918 గ్రామ పంచాయతీలలో సర్పంచుల అకౌంట్ల నుంచి నిధులను ఏపీ సర్కార్‌ వాడుకుందని వైవిబి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.

వేల కోట్ల రూపాయలను రాజ్యాంగ విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం నిధులను డ్రా చేసుకొని సొంత అవసరాలకు వాడుకుందని విమర్శించారు. ఈ నిధులను తిరిగి సర్పంచుల అకౌంట్లో జమ చేసేంత వరకు వివిధ రూపాల్లో నిరసనలు చేసేలా, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సమావేశంలో నిర్ణయించారు.

నిజానికి పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ, జగన్‌ సర్కార్ వచ్చిన తర్వాత..పర్సనల్‌ డిపాజిట్‌ అకౌంట్ల రూపంలో ఓ వెసులుబాటు కల్పించుకుందని చెబుతున్నారు. దాని ప్రకారం రాష్ట్రంలోని పీడీ ఖాతాలన్నీ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నియంత్రణలోనే ఉంటాయి. ఆర్థిక శాఖ కార్యదర్శికి మాత్రమే ఖాతాల్లోని నిధులు తీసుకునేలా వెసులుబాటు తీసుకొచ్చారు.

ఈ వెసులుబాటుతో గత డిసెంబరులో కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను లాగేశారు. మొన్న మార్చి 31వ తేదీన మరోసారి పంచాయతీల అకౌంట్లలోని నిధులను తీసేసుకున్నారు. ఇలా సర్పంచులు, పంచాయతీల కార్యదర్శులకు కూడా తెలియకుండానే మొత్తం నిధులను, పైసాలేకుండా పీల్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story