Suicide : భార్యకు వీడియో కాల్ చేసి.. రైలు కిందపడి భర్త ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. వట్టేపల్లికి చెందిన సయ్యద్ నయీమ్(28)కు నేహఫాతిమాతో వివాహం జరిగింది. వారికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. సయ్యద్ నయీమ్ కొద్ది రోజులుగా ఆర్థిక సమస్యలతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడు.
బుధవారం అర్థరాత్రి మైలార్దేవ్పల్లి రైల్వే గేట్ వద్దకు వచ్చిన నయీమ్.. భార్య ఫాతిమాకు వీడియో కాల్ చేశాడు. ‘తనకు చెప్పలేనన్ని బాధలు ఉన్నాయని, నా చావుకు ఎవరూ కారణం కాదని వీడియో కాల్లో మాట్లాడుతూ’ ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నేహఫాతిమా కుటుంబసభ్యులకు చెప్పగా, వారు మైలార్దేవుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు అక్కడికి వచ్చి ప్రమాదం జరిగిన ప్రాంతం రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని కాచిగూడ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సయ్యద్ నయీమ్ ఫోన్లో భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. రైల్వే గేటు వద్ద ఉన్న సీసీ ఫుటేజీలోనూ అలాగే రికార్డు అయినదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com