TS : డాక్టర్ల నిర్లక్ష్యం.. కిడ్నీ సమస్యతో మహిళ మృతి

కిడ్నీ సమస్యతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఓ మహిళ చనిపోయింది. ఇందుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ నగరంలో శుక్రవారం జరిగింది. వరంగల్లోని గిర్మాజీపేటకు చెందిన ఐలోని వాణి (45) కిడ్నీ సమస్యతో మే 11న వరంగల్లోని సంరక్ష హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆరోగ్యం విషమించడంతో మరో హాస్పిటల్కు తీసుకెళ్లాలని డాక్టర్లు మే 24 వాణి బంధువులకు సూచించారు. అప్పటికే రూ. 9 లక్షలు వసూలు చేసిన హాస్పిటల్ యాజమాన్యం సరైన ట్రీట్మెంట్ చేయడం లేదంటూ వాణి బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు వచ్చి యాజమాన్యంతో పాటు, బాధితులతో మాట్లాడారు. వాణిని హైదరాబాద్కు తీసుకెళ్లాలని, అక్కడ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చును తామే భరిస్తామని సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. దీంతో వాణిని ఆమె బంధువులు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి వాణి చనిపోయింది. సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం వైద్య ఖర్చులు చెల్లించకపోగా, ట్రీట్మెంట్ చేయడంలో నిర్లక్ష్యం చేశారంటూ వాణి బంధువులు మృతదేహంతో శుక్రవారం వరంగల్కు చేరుకొని సంరక్ష హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com