POW అధ్యక్షురాలు సంధ్య భర్త మృతి
ప్రగతిశీల మహిళా సంఘం- POW అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఫిబ్రవరి 16 శుక్రవారం రోజున ఆయన గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్ హైదర్ గూడలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు.
అపోలో హాస్పిటల్ లో డాక్టర్ల కృషి ఫలించలేదు. చికిత్స పొందుతూ రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. సంధ్య భర్త మృతి చెందిన విషయం తెలిసి వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చారు. రామకృష్ణా రెడ్డి భార్య సంధ్యను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దామని సంధ్య గురువారం పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతుధర చట్టం చేయాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, అమ్మకాలను మానుకోవాలని, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని నినదిస్తూ ఫిబ్రవరి 16న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ కేంద్ర కార్మిక, రైతు సంఘాలు సమ్మెను నిర్వహిస్తున్నాయని తెలిపారు. రవాణా రంగంలో డ్రైవర్ల పాలిట యమపాశంగా కొత్తగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో సెక్షన్ 106 (1),(2)లను రద్దు చేయాలని కోరుతూ రవాణారంగ కార్మిక సంఘాలు రవాణా రంగ సమ్మెను ప్రకటించాయన్నారు. వాటికి మద్దతు తెలిపారు. కార్మికుల పక్షాన పలు కార్యక్రమాలలో పాల్గొనాల్సిన సంధ్య కుటుంబంలో జరిగిన అనుకోని ఘటనతో విషాదంలో మునిగిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com