Suicide : పని ఒత్తిడిని తట్టుకోలేక గ్రామ కార్యదర్శి ఆత్మహత్య!

పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ గ్రామ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పల్లెబోయిన శ్రావణి(34) అనే మహిళ.. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గాంధీపురంలో నివాసం ఉంటున్నారు. పనిభారం పెరిగిందని, పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాని తండ్రి సాంబయ్యతో ఆమె తన బాధను చెబుతుండేవారు. ఈ క్రమంలో ఆదివారం కర్కపల్లిలో నీటి సమస్య ఉందని ప్రజలు చెప్పడంతో వెళ్లి సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత అలసిపోయి ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరేసుకున్నారు.
ఇంటికి వచ్చిన భర్త శ్రావణిని చూసి వెంటనే హనుమకొండలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం శ్రావణి మృతదేహానికి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆమె అత్తగారి ఊరు ఇంచెర్లలో అంత్యక్రియలు నిర్వహించారు. పని ఒత్తిడి కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, శ్రావణి ఆత్మహత్య విషయమై జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, ఎంపీడీ వో భాస్కర్ను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి విధుల్లో ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. శ్రావణి తనకు సెలవు కావాలని ఎన్నడూ అడగలేదని, ఆదివారం గ్రామపంచాయతీకి వెళ్లాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com