కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి ముగ్గురు మహిళల మృతి
కర్ణాటక రాష్ట్రంలోని (Karnataka) తుమకూరు జిల్లా (Thumakuru District) పావగడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 22న నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించాయి. శస్త్ర చికిత్స చేయించుకున్న ఏడుగురు మహిళల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు.
మృతిచెందిన వారిలో పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామానికి చెందిన అంజలి (22), వీర్ల గొంది గ్రామానికి చెందిన అనిత (28), బ్యాడనూరు గ్రామానికి చెందిన నరసమ్మ (40) ఉన్నారు. వీరిలో అంజలి, అనితకు సిజేరియన్ ఆపరేషన్తోపాటు కు.ని. చికిత్స కూడా నిర్వహించారు. నరసమ్మకు కేవలం కు.ని. శస్త్రచికిత్స చేశారు. అనిత ఆపరేషన్ జరిగిన రోజే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు ఈనెల 24న మృతి చెందారు.
వైద్యుల నిర్లక్ష్యానికి కారణమని ఆరోపిస్తూ మృతుల కుటుంబ సభ్యులు సోమవారం పావగడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుడితో పాటు ముగ్గురిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా గైనకాలజిస్ట్ డాక్టర్ పూజ, నర్సు పద్మావతి, ఓటీ టెక్నీషియన్ కిరణ్ బీఆర్లను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com