Thieves : డాబాపై నిద్రపోగా.. ఇంట్లోని నగలు, డబ్బు చోరీ

డాబాపై నిద్రిస్తుండగా.. ఇంట్లో దొంగలు పడి నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు. ఆదిబట్ల పోలీసులు (Adibatla Police) తెలిపిన ప్రకారం.. ఎన్ఎస్ఆర్ కాలనీలో ఉండే సామల ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి డాబాపై నిద్రపోయారు. గురువారం తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు అల్మారాల్లోని 8 తులాల బంగారు ఆభరణాలు రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారు. తెల్లారిన తర్వాత ఇంట్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో వచ్చిన పోలీసులు ఆధారాలుసేకరించారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఇంట్లో దొంగలు పడి నగదు ఎత్తుకెళ్లారని ఓ యువతి ఆడిన డ్రామాతో పోలీసులు పరుగులు పెట్టారు. రాజేంద్రనగర్ ఎర్రబోడకు చెందిన ఓ యువతి తన ఇంట్లో గురువారం ఉదయం వాష్రూమ్లో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని దొంగలు మంకీ క్యాప్ లతో చొరబడి అల్మారాలోని రూ. 25 వేల నగదు ఎత్తుకెళ్లారని రాజేంద్రనగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.
తను గట్టిగా కేకలు వేసి దుండగులను పట్టుకునే యత్నం చేసినా పారిపోయారని మీడియాకు కూడా తెలిపింది. పోలీసులు వెళ్లి సీసీ కెమెరాల చెకింగ్ తో పాటు యువతిపై అనుమానంతో విచారించారు. దీంతో యువతి డ్రామా ఆడిందని తేలింది. ఆమె ఆన్లైన్లో గేమ్ ఆడి రూ. 25 వేల పోగొట్టుకుందని, దీంతో ఇంట్లో చెబితే కొడతారనే భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది. కౌన్సిలింగ్ చేసి పంపినట్టు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com