Tirupati : టీటీడీ స్థానికాలయాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీలక్ష్మి నారాయణ స్వామి ఆలయాలలో బుధవారం సాయంత్రం ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం నాటి నుండి టీటీడీ ఆదాయవ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం …..
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం ఆస్థానం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పుండరీక వల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ భాస్కర నారాయణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామాలయంలో …….
శ్రీ కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు.
అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com