Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం వరుస సెలవులు, వారాంతం కావడమే. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్ అక్టోపస్ బిల్డింగ్ బయటి వరకు విస్తరించింది. నిన్న, ఆగస్టు 15న 77,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 41,859 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం ₹3.53 కోట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, టీటీడీ అధికారులు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆహారం, పాలు, త్రాగునీరు వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీలో గందరగోళం నెలకొంది. టికెట్లు దొరకని భక్తులు నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు రోజూ ఆఫ్ లైన్లో టికెట్లు పొందే భక్తులకు అదే రోజు సాయంత్రం దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ రోజు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోకులాష్టమి ఆస్థానం, స్నపన తిరుమంజనం వంటి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. రేపు ఉట్లోత్సవం వేడుకలు జరగనున్నాయి. వంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు లక్కీ డిప్ కోసం ఆగస్టు 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com