TTD : తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..టీటీడీ సమగ్ర ఏర్పాట్లు

TTD : తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..టీటీడీ సమగ్ర ఏర్పాట్లు
X

వేసవి సెలవుల కారణం వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లో వేచివున్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్న ప్రసాదం, తాగునీరు పంపిణీ ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది. టిటిడి యంత్రాంగం కృషితో శనివారం రోజున 90,211 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు ఇతర ప్రసాద కేంద్రాల్లో కలిపి 51 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో మరో 20 లక్షల మందికి పాలు, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేశారు.

మే నుంచి ప్రతిరోజూ సగటు 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90 వేలకు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నారు. మే 24 న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. అదేరోజు బయట క్యూలైన్లు, వైకుంఠం ప్రాంతాల్లో 2.72 లక్షల అన్నప్రసాదాలు, 1.17 లక్షల పానీయాలు అందించారు. అదేవిధంగా క్యూలైన్లో తాగు నీరు సరఫరా, పరిసరాల పరిశుభ్రతను ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 2.150 మంది శానిటరి కార్మికులు, సూపర్వెజర్లు మేస్ట్రీలు, ఇన్స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటల పాటు సేవలందిస్తున్నారు. తిరుమలలో ప్రతిరోజూ దాదాపు మూడువేల మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలు అందిస్తున్నారు. క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా నాలుగు షిప్టులలో అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలను శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వెజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజిలెన్స్, ఆలయ విభాగాలు దర్శన క్యూలైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నారు. గత మూడు రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Tags

Next Story