TTD : తిరుమలలో నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభం

శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని మంగళవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూ.60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు.
రేపటి నుంచే ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభం అవుతుందని, భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అనంతరం హెచ్ వీసీ, ఏఎన్సీ ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూతనంగా ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్, శ్రీ సదాశివరావు, శ్రీ నర్సిరెడ్డి, శ్రీమతి జానకి దేవి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com