Shabarimala Temple : తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని పవిత్ర శబరిమల ఆలయం సాయంత్రం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు సాగే మండల మకరవిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సిద్దమైంది. సాయంత్రం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. రోజుకు ఎంత మంది భక్తులను దర్శనాల కోసం అనుమతించాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రతీ రోజు ఆన్లైన్లో 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 10 వేల మంది అలా మొత్తం 80 వేల మందిని దర్శనాలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సయాచారం. అందుకు తగ్గట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శబరిమల సహా పలు ఆలయాలను నిర్వహిస్తోన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మధ్యాహ్నం నుంచి యాత్రికులకు ప్రవేశం కల్పించనుంది. ఆలయ తలుపులు తెరిచిన తర్వాత పూజారుల మార్పు సాయంత్రం జరగనుంది. అయితే దర్శనాలు మాత్రం శనివారం ఉదయం మొదలుకానున్నాయి. అప్పటి నుంచే మండల పూజల సీజన్ అధికారికంగా మొదలవుతుందని చెబుతున్నారు.
వర్చువల్ క్యూ కోసం శుక్రవారం 30 వేల మంది భక్తులు ఆన్లైన్లో టిక్కెట్లు కొనుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనాల సమయం కూడా పెంచారు. రోజుకు 18 గంటల పాటు దర్శనాలు ఉంటాయని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో 914 మీటర్ల ఎత్తులో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి పంబ నుంచి 4 కిలోమీటర్ల కాలినడక ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. 10 ఏళ్లు నిండి.. 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మండల కాలం అంటే 41 రోజుల పాటు దీక్ష చేపట్టి.. ఇరుముడితో వస్తారు. పవిత్ర 18 మెట్లు మీదుగా స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి ఉన్నవారికే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అనుమతి ఉంటుంది.
సాధారణ భక్తులు ఈ మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. వీరిని పక్కనే ఉన్న గేటు ద్వారా అనుమతిస్తారు. మండల-మకర విళక్కు పూజల సీజన్ ఏర్పాట్లు, బందోబస్తుపై కేరళ డీజీపీ షేక్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 14 వేల మంది పోలీసులతో పాటు వాలంటీర్లను భద్రత విధులు, యాత్రికుల సేవల కోసం మోహరిస్తున్నట్టు తెలిపారు. అలాగే, భక్తుల వాహనాల పార్కింగ్ స్లాట్లను 10 వేలకు పెంచారు. రెస్టారెంట్లు, హోటళ్లపై ధరల వివరాలను దక్షిణాది అన్ని భాషల్లోనూ ఉంచాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com