TTD : కంపార్టుమెంట్లన్నీ ఫుల్.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

TTD : కంపార్టుమెంట్లన్నీ ఫుల్.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?
X

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు సమకూరింది.

శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో గత మూడు రోజులుగా చేపట్టిన జ్యేష్టాభిషేక మహోత్సవం గురువారంతో ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత అర్చకులు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి అక్కడ వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం చేపట్టారు.

Tags

Next Story