Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు.

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు.
X

తిరుమలలో వసతి సమస్యను అధిగమించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులకు వసతి ఇబ్బందులు రాకుండా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చేస్తూ ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ‌వాణి టికెట్లను కొనుగోలు చేసి స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులకు వసతి సమస్య రాకుండా ఉండేందుకు ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 10 గంటలకు ఉన్న దర్శన సమయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మార్పు చేసింది.

ఏ రోజుకు ఆ రోజు శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు పొందే భ‌క్తులకు అదే రోజు దర్శనం కల్పించనుంది.

తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమావేశం నిర్వహించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆగ‌స్టు 1 నుంచి నూత‌న విధానం అమ‌లు చేయనుంది. ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు శ్రీవాణి టికెట్ల‌ను జారీ చేయనుంది. రేణిగుంట విమానాశ్ర‌యంలో ఉద‌యం 7 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్లు జారీ చేయనుంది. తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్ర‌యంలో 200 టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది.

ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు మాత్రం య‌థావిధిగానే ఉద‌యం 10 గంట‌ల‌కే దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

న‌వంబ‌ర్ 1వ నుండి ఆఫ్ లైన్, ఆన్ లైన్ శ్రీ‌వాణి టికెట్ల‌ను పొందిన భ‌క్తులకు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద సాయంత్రం 4.30 లకు రిపోర్టింగ్ సమయం కేటాయిస్తోంది. శ్రీవాణి టికెట్‌ల ద్వారా టీటీడీకి రోజు రూ. కోటిన్నర ఆదాయం వస్తుండగా ఏటా దాదాపు రూ. 500 కోట్లు వస్తోంది. నూతన విధానం తో భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.

Tags

Next Story