MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సా.4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, -ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు ఏపీలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇలా ఓటేయండి!
అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న బాక్సులో ప్రాధాన్యత ప్రకారం అంకె వేయాలి.
కచ్చితంగా ఎవరికో ఒకరికి తొలి ప్రాధాన్య ఓటు వేయాలి. 1 నంబర్ ఇవ్వకుండా 2, 3, 4 అంకెలు వేస్తే ఓటు చెల్లదు.
ఒక అభ్యర్థికి ఒక నంబర్ మాత్రమే ఇవ్వాలి. ఒకే నంబర్ను ఇద్దరు, ముగ్గురికి వేసినా ఓటు చెల్లుబాటు కాదు.
ఓటు వేసేందుకు పోలింగ్ సిబ్బంది ఇచ్చే స్కెచ్నే వాడాలి.
బ్యాలెట్పై టిక్ చేయడం, పేర్లు రాయడం వంటివి చేయొద్దు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com