Heavy Rains : తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని APSDMA తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ప.గో, తూ.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది.
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. వాగులు, కాజ్వేలు, కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com